22, ఏప్రిల్ 2013, సోమవారం

మధురోహాలూ ... మధుపర్కాలూ...'గుడిహాళం పద్యం ' !
ఒక స్థితి 

లోకం లో 'తన ప్రియుడు' తప్ప మరొక 'ప్రాణి' ఏదీ తనతో పాటు జీవిస్తున్న స్పృహ లేకుండా తిరిగే 'ప్రియురాలు'  ... కేవలం 'తన ప్రియురాలి' ఉనికి వల్లే లోకం ఇంత మనోహరంగా వున్నట్టు ఒక మైకం లో బతికే 'ప్రియుడు' .... వాళ్ళిద్దరూ ఒకరి సన్నిధిలో మరొకరు గడపడానికి తప్ప, మరొక విలువ ఏదీ తనకు లేనట్టు బేఖాతరుగా అలా కలలా కరిగిపోయే కాలం .....

మరొక స్థితి

తాను కలలు గన్నమనోహర జీవితం యిది కాదన్న నిరాశలో 'ఆయన'
తన రంగుల కలల సౌధం కుప్పకూలిన బెంగలోఆవిడ’

ఇంతకీ రెండు  స్థితుల నడుమ జరిగిందేమిటి?
కడు పాతదే అయిన ఊహాజనిత ప్రశ్న ఒకటి మళ్ళీ యిక్కడ...
శరత్ నవల దేవదాసు లో పార్వతీ దేవదాసుల ప్రేమ ఫలించి వుంటే ఏం జరిగి వుండేది?
'పెళ్లి'
'..... తరువాత?'
నవల సంగతి సరే.... స్థితిని పట్టుకున్న పద్యం ఏదయినా ఉందా?
ఉంది....అది మామూలు పద్యం కాదు....కవి 'గుడిహాళం రఘునాథం' పద్యం....

అతడూ, ఆమె ప్రేమలో మునిగి వున్నరోజులు/ క్షణాలు ఎంతటి సమ్మోహన శక్తిని దాచుకున్నవో,  గుడిహాళం  తన 'దాంపత్యం' పద్యం లో జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి ....

"ఇవే రోజులు  /ఇవే క్షణాలు
కానీ సాయంత్రాలు సంతోషాన్ని మోసుకొచ్చేవి
మనసులు మాధుర్యాన్ని వెదజల్లేవి
మనిద్దరి చూపులు కలిసిన చోట
మట్టి రేణువులు సైతం మల్లెలై విరిసేవి
గాలి తరగలు గాంధర్వాన్ని  ఆలపించేవి
క్షణాలు మాటల వనాలై మత్తుగా వూగేవి
ఆశల కిరణాలై హృదయాన్ని ఆవహించేవి"

మరి అలాంటి స్థితిలో ఆ ప్రియునికి  తన చుట్టూ వున్న ప్రకృతీ, తన సమక్షం లో వున్న ప్రియురాలు  ఎంత మనోహరంగా తోచేవి ......?
మీరు ఇప్పుడు ప్రేమలో వున్న వారైనా (లేక) ఒకప్పుడు ప్రేమలో పడి వున్న వారైనా (లేకప్రేమించి పెళ్లి చేకున్న వారైనా... కవి సృజించిన పద్య పాదాలని స్పృశించి, ఒక్క సారి మనసారా  మీ అమృతమయ జ్ఞాపకాలని నెమరువేసుకొనండి  .... మధుర క్షణాలని మళ్ళీ ఒక సారి పలవరించండి!

"అప్పుడాకాశం అంతా ఒకటే కిలకిలలు
కొలను నిండా ఎప్పుడూ గలగలలు
వెచ్చని హాయినిచ్చే పలకరింతల వెన్నెల దృశ్యాల్లో
నీ మాటలెంతో  సుగంధంగా ఉండేవి
అందమైన కలల్ని అల్లేవి
నీ తలపులు ప్రేమ తటాకాలపై వాలి క్రీడించేవి
వేయి రాగాలని హత్తుకోవాలని పరితపించేవి
విరుచుకు పడే అలల్లో పురివిప్పిన పించాల్ని దర్శించాలని పరుగులెత్తేవి"

కలలెప్పుడూ కలకాలం వుండవు....కల లాగ సాగిపోయే ప్రేమ ఖచిత యౌవన కాలం అసలే వుండదు....
మనం గాలి తరగల నడుమ, కిలకిలల ఆకాశం కింద, గలగలల కొలను వొడ్డున, వెచ్చని హాయినిచ్చే వెన్నెల కాంతిలో ఒంటరిగా లేము కదా.....
కట్టుబాట్లను  గిరిగీసిన నాగరిక సమాజం నడుమ బతికే వాళ్ళం కదా....మేము ఇక ఎప్పటికీ ప్రేమికులు గానే ఇలా  హాయిగా వుండిపోతామంటే విని తట్టుకుంటుందా? చేతులు కట్టుకుని  నిశ్సబ్దంగా ఉంటుందా?  ... మరేం చేస్తుంది....? పెళ్లి చేస్తుంది...పెళ్లి చేసుకుని 'తన లాగే సుఖంగా' ఉండమని  పోరు పెడుతుంది... (పెళ్లి) తరువాత? తరువాత ఏమిటో కవి  పద్య పాదాల్లోనే చదవండి...

"వారాలు రాలాయి/హారాలు మారాయి
దాంపత్యం కురిసింది
మట్టి వాసన నాలో లేచింది / అసహనం నీలో వీచింది
తెరలు వాలాయి/కలలు కూలాయి
పాట ఆగిపోయింది /రెండు స్వరాలమై రాలి స్థిరపడ్డాం
పెళ్ళాం ఫ్రేములో నీవు/మొగుడి ఫ్రేములో నేను
అంతే!"

'అంతే' అన్న గుండెని మెలిపెట్టే చిన్న మాటతో వేయి రాగాలని హత్తుకోవాలని కలగన్న హృదయం ఒకే ఒక్క స్వరమై రాలి పడి, సమాజం నిర్ణయించిన ఫ్రేములో స్థిరపడి పోయిన పెను విషాదాన్ని కవి మన కళ్ళ ముందు నిలిపాడు.
'ప్రేమ' పెళ్లి' గా స్థిరపడిన తరువాత, సీతాకోక చిలుకల్లాంటి 'ప్రియుడు', 'ప్రియురాలు' రెండు గొంగళి పురుగుల్లాంటి  'ఆయన', 'ఆవిడ' గా రూపాంతరం చెందిన కథను ఆలపించాడు

చాలా పద్యాలే చదివి ఉంటాము....కానీ, 'ప్రేమ' నుండి 'పెళ్లి' లోకి ప్రయాణించి, కోల్పోయిన ప్రేమని పలవరించిన అరుదైన పద్యంగుడిహాళం రాసిన 'దాంపత్యం'.
గుడిహాళం తన జీవిత కాలం లో రాసినవి కొన్ని పద్యాలే  అయినా, ఒక్కొక్కటీ ఒక 'మార్వెల్'  !
'తెలుగు కవిత్వం లో గుడిహాళం అరుదైన కవి' అని నేను మళ్ళీ ఇక్కడ చెప్పడం సాహసమే అయినా, నా కోసం నేను మరొక్క సారి అనకుండా ఉండలేను ..(ఆయనే మరొక పద్యం లో చెప్పాడు... 'ఇప్పుడు పద్యం రాయాలంటే గొప్ప సాహసం కావాలి') 

-----[వాకిలి-ఇ-సాహిత్య పత్రిక ఏప్రిల్-2013 ]

కామెంట్‌లు లేవు: